విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం

  • విగ్రహం నుంచి తల, కాలు వేరు చేసిన దుండగులు
  • విజయవాడ నిడమానూరులో దారుణం
  • పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఏపీలో విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. అంతర్వేది సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఘటనలు సంచలనం రేకెత్తించాయి. తాజాగా విజయవాడ దుర్గ గుడిలోని రథంపై ఉన్న సింహం బొమ్మలు మాయం కావడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో విజయవాడలో మరో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం వెలుపల ఉంచిన విగ్రహం నుంచి తల, కాలు వేరు చేసినట్టు నిర్వాహకులు గుర్తించారు. నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీఐ సురేశ్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన వ్యక్తులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Vijayawada
Saibaba
Patamata
Statue

More Telugu News